'సామాజిక దూరం' పదం వాడుకను సవాల్ చేస్తూ పిటిషన్... పిటిషనర్ కు రూ.10 వేలు ఫైన్ వడ్డించిన సుప్రీం

  • కరోనా నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న సామాజిక దూరం
  • ఇది వివక్షను సూచించేలా ఉందంటూ సుప్రీంలో పిటిషన్
  • కోర్టు సమయాన్ని వృథా చేశారన్న సుప్రీం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు భారత్ లో లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నివారించాలంటే ప్రజలు గుమికూడకుండా, ఒకర్ని ఒకరు తాకకుండా 'సామాజిక దూరం' పాటించాలంటూ తొలినాళ్లలోనే హెచ్చరించారు. అయితే, 'సామాజిక దూరం' అనేది వివక్షకు సంబంధించిన అంశంలా ఉందని, 'భౌతికదూరం' అనే పదం సరైనదని చాలామంది అభిప్రాయపడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా 'సామాజిక దూరం' అనే పదాన్ని ఉపయోగిస్తుండడంపై షకీల్ ఖురేషి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇదే పదాన్ని వాడుతున్నాయని, 'సోషల్ డిస్టెన్సింగ్' (సామాజిక దూరం) అనే పదం మైనారిటీ వర్గాల పట్ల వివక్షను సూచించేలా ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. 'భౌతికదూరం' అనే పదం వాడేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరాడు. అయితే, సుప్రీం ధర్మాసనం ఆ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా, కోర్టు సమయాన్ని వృథా చేశాడంటూ రూ.10 వేలు జరిమానా విధించింది.

Supreme Court
Social Distancing
Physical Distancing
Petition
Fine
Lockdown
Corona Virus

More Telugu News